Saturday, April 27, 2024

Chandrababu: ఏపీకి వైసీపీ గ్రహణం.. జగన్ తప్పులను చరిత్ర క్షమించదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యర్థులపై టీడీపీ చేస్తున్నది రాజకీయ యుద్ధమే…భౌతిక యుద్ధం కాదన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎండగట్టాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులకే పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి 70 లక్షలమంది సైన్యం ఉందన్న చంద్రబాబు… వారికి ఏ ఇబ్బంది వచ్చినా తామున్నామని నాయకులు భరోసా ఇవ్వాలన్నారు. తెలుగుజాతి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. త్వరలో మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభిస్తాం అని వెల్లడించారు.

మార్చి 29నాటికి పార్టీ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుందన్నారు. ఆ తర్వాత మహానాడు ఉంటుందని చెప్పారు. మే 28న దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా  సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2022 మనకు అత్యంత కీలకమైన సంవత్సరం అని, త్వరలో రాబోయే ఏడాదికి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ తయారు చేస్తామని చెప్పారు. టీడీపీకి ఎన్టీఆర్ బలమైన పునాదులు వేశారన్న చంద్రబాబు.. ఆయన ఆశయసాధనకు యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం పునరంకితం కావాలని కోరారు.

జగన్ రెడ్డి పాలన ప్రారంభమై 32 నెలలు గడిచిందని, ఇంకా సుమారు రెండేళ్ల కాలం మిగిలి ఉందన్నారు. రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందన్న చంద్రబాబు.. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీని నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులందరిపై అక్రమ కేసులు ఉన్నాయని తెలిపారు.  ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, భూములు దానం చేసిన అశోక్ గజపతిరాజుపైనా అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆయన ఎక్కడా ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. రామతీర్థంలో ధర్మకర్త పేరే లేదని, దీన్ని ప్రశ్నిస్తే కేసు పెట్టారన్నారు. రాష్ట్రంలో శాసనసభ జరిగే పరిస్థితి లేదన్నారు. జరిగినా ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రత్యర్థులపై బూతులతో ఎదురుదాడికి దిగుతూ చట్టసభల గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు షరీఫ్ పట్ల ఏవిధంగా వ్యవహరించారో చంద్రబాబు గుర్తు చేశారు.

జగన పాలనలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అడ్డగోలు నిర్ణయాలపై తీర్పులిచ్చిన న్యాయవ్యవస్థపైనా దాడికి దిగారన్నారు. టీడీపీకి అధికారం, ప్రతిపక్షం కొత్తకాదన్నారు. రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణ పాలన గతంలో ఎప్పుడూ లేదన్నారు. జగన్ రెడ్డికి విశ్వసనీయత లేదని, తండ్రి అధికారంలో ఉన్నపుడు ఆయనను అడ్డుపెట్టుకుని పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 11 సీబీఐ కేసులు ఉన్నాయన్నారు.

రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. రూ.22,945 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ సుపరిపాలన అందించిందన్నారు. టీడీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ అమలు చేయలేదని చెప్పారు. అయిదేళ్లలో ఎప్పుడూ పన్నులు పెంచలేదన్న చంద్రబాబు.. ఇరిగేషన్ కు రూ.64వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అమరావతి ద్వారా రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల సంపద వచ్చిందని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చిత్తశుద్ధితో చేపట్టి 70శాతానికి పైగా పూర్తిచేశాం అని గుర్తు చేశారు. కియా, హీరో మోటార్స్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయని చంద్రబాబు వివరించారు.

- Advertisement -

నేడు ఏపీకి ఒక్క పరిశ్రమ రావడం లేదన్నారు. అప్పు మాత్రం రూ.7 లక్షల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు తెలంగాణతో సమానంగా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చామన్నారు. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు ఎవరూ లబ్ధి చేకూర్చలేదని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో దేశంలోనే ఏపీ నెం.1. అని చెప్పారు.

రాష్ట్రప్రజలు సంక్రాంతి కూడా జరుపుకోలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ ఇచ్చిన సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలను రద్దు చేశారని మండిపడ్డారు. నేడు ఆర్టీసీ, మున్సిపల్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్,.. చివరకు చెత్తపైనా పన్నువేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టకపోతే వారి ఇంట్లోనే వేయాలని వైసీపీ ఎమ్మెల్యే చెబుతున్నారని మండిపడ్డారు. పేదవారికి అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు పన్నుల  భారంతో వారి నడ్డి విరిచారన్నారు. మరుగుదొడ్డిపైనా పన్ను వేశారన్న చంద్రబాబు.. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకున్నారని ఆరోపించారు.

దేశంలో ఎవరూ కట్టని విధంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించిందన్నారు. పేదవారికి ఆస్తి సృష్టించాం అని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పేదలకు 2.65 లక్షల విలాసవంతమైన టిడ్కో నిర్మిస్తే అవి ఇవ్వడానికి జగన్ రెడ్డికి మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఉపాధి లేదు, ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రైతులు చితికిపోయారన్నారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి… ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అని అన్నారు.

ప్రధాని ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6వేలకు జగన్ రెడ్డి రూ.7,500 కలుపుకుని రూ.13,500 తామే ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే రూ.2వేలు పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో కూడా మందులు లేవన్నారు. ఏజెన్సీలో గర్భిణీలకు ప్రసవాలకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లీ- బిడ్డా ఎక్స్ ప్రెస్ అటకెక్కిందన్నారు. విద్యారంగాన్ని కూడా భ్రష్టు పట్టించారన్న చంద్రబాబు.. ఇంగ్లీషును టీడీపీ వ్యతిరేకిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చెప్పేదే నిజమైతే ఇంగ్లండ్, అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడే వారికే అన్ని ఉద్యోగాలు రావాలి కదా అని ప్రశ్నించారు. భాష కంటే జ్జానం ముఖ్యం అని అన్నారు. నాడు-నేడు పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement