Saturday, April 27, 2024

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలో వైసీపీ నేతల హస్తం

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కొత్తగా నిర్వహించే ఎన్నికలకు అయ్యే ఖర్చును సీఎస్, ఎస్ఈసీల నుంచి వసూలు చేయాలని చెప్పారు.

ఏపీలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని విష్ణువర్ధర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా రోగులను రక్షించడంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కానీ వైసీపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీలో ఎంతో మంది వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 514 ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్టు  చెప్పుకుంటున్నారని… అయితే ఆ ఆసుపత్రుల్లో 10 శాతం బెడ్లు కూడా కేటాయించలేదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రెమ్ డెసివిర్, ఆక్సిజన్ ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడనికే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటి వరకు ఒక్క ఆసుపత్రిని అయినా సందర్శించారా ? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో ఆరోగ్యానికి కేటాయింపు ఎంత? రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత కేటాయించారు? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బోగస్ అని ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందన్నారు. మెడికల్ కళాశాలలకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement