Thursday, April 25, 2024

ఇకనైనా పంతాలకు పోకండి : పవన్‌ కల్యాణ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే తీర్పుగా అభివర్ణించారు. ఏడాది క్రితం నోటిఫఙకేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితులు కారణంగా ఎన్నికలు రద్దు చేశారని తెలిపారు. తిరిగి అదే నోటిఫికేషన్ పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలో ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. హైకోర్టు ఈ ఎన్నికలను రద్దు చేయాలని తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా.. తాజా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని పవన్‌ కళ్యాణ్‌ కోరారు.

కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపింది. ఈ ఎన్నికలను రద్దు చేస్తూ.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆప్పీల్ కు వెళ్లనుంది.  ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని కోరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement