Wednesday, May 15, 2024

Big story : శివరామిరెడ్డికి బావి సెంటిమెంట్ : పూడ్చిన బావిని తవ్విస్తున్నారు

అనంతపురం :భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ మంది ప్రజలు పాటిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. తమ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా.. సాఫీగా సాగాలని.. ఆయురారోగ్యాలు.. సిరి సంపదలు, అధికారిక పదవులు అనుభవించాలని తపన పడేవారు.. రకరకాల వ్రతాలు, పూజలు పునస్కారాలు.. మొక్కుబడులు ఇలా తమకు తోచినది ఆచరించి అమలు చేస్తూ ఉంటారు. అందులో విజయం సాధించిన వారు తాము నమ్ముకున్న దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూజిస్తుంటారు. ఆ విధంగానే.. ఇటీవల లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఎన్నికైన శివరామిరెడ్డి … ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని విధాలా తనకు బాగుండాలంటే గ్రామంలో ఉన్న పాడుపడిన బావిని.. తిరిగి తవ్వించాలని సిద్ధాంతులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ బావిని పూడ్చిన అప్పటి నుంచి.. శివరామరెడ్డి కి అన్ని విధాలా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో బావిని తిరిగి తవ్వించాలని, పూజారులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బావి తవ్వే పనికి శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన మరికొందరు ఆ బావి మీద తమకు హక్కులున్నాయని, తవ్వ కూడదని ఆక్షేపిస్తున్నారు.


2018లో పూడ్చిన బావి పూర్వీకుల స్థిరాస్తి 574,75 సర్వే నెంబర్లు ఉన్న పాడుబడిన బావిని సంబంధీకులు పూడ్చి వేశారు. పైగా పాడుబడి నీళ్లు లేకపోవడంతో పలు ప్రమాదాలు జరగడంతో పూడిచి వేశామన్నారు. ఆరు నెలల కిందట గ్రామకంఠం కింద ఉందని ఎమ్మెల్సీ శివరామి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు .ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిందని తన అనుచరులను పిలిపించుకొని ఎమ్మెల్సీ జేసీబీతో మట్టిని తవ్విస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామి రెడ్డి గ్రామ కంఠం సంబంధించిన భావి అని హైకోర్టును ఆశ్రయించారు. అయితే పంచాయతీ అధికారులు గ్రామ కంఠం అని కోర్టుకు తెలియజేశారు. అధికారులు శివరామి రెడ్డి చెప్పినట్లు వింటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే బాధితులు మాత్రం కోర్టు ఆర్డర్ కాదు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామకంఠంకు చెందిన ఈ బావిని తవ్వించడం వల్ల నీటి లభ్యత ఉంటుందని, శివరామిరెడ్డి వర్గం చెబుతోంది. ఇందులో ఎటువంటి సెంటిమెంట్లు లేవని పేర్కొంటున్నారు. మొత్తానికి పాడుబడిన బావిని తవ్వించడం లో మతలబు ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1000 అడుగుల మేరకు బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి.. ఈ బావిని తిరిగి త వ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో శివరామిరెడ్డికే తెలియాలని స్థానికులు పేర్కొంటున్నారు. బావి గొడవ ఏమిటిరా అని తలలు పట్టుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement