Monday, May 6, 2024

గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. కడచూపు నోచుకోని సొంత నియోజకవర్గం

గుండెపోటుతో కన్నుమూసిన ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతికకాయం నెల్లూరులోని ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు తనకు జన్మనిచ్చిన సొంత ఊరుకు అలాగే 9 ఏళ్ల రాజకీయ బంధం ఉన్న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం చివరిచూపు నోచుకోకపోవడం సొంత గ్రామస్తులు,అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కనీసం సొంత గ్రామానికి అయిన మేకపాటి కడచూపు నోచుకుంటే బాగుండేది అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మేకపాటికి ఏమాత్రం బంధం లేని నెల్లూరు సిటీకి, ఉదయగిరి కేంద్రానికి మాత్రమే మేకపాటి చివరిచూపు దర్శనానికి పరిమితం చేయడంతో ఆత్మకూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రేపటి వరకు సమయం ఉన్నందున కనీసం ఉదయగిరికి వెళ్లే సమయంలో నైనా ఒక్క పది నిమిషాలు తన నియోజకవర్గ కేంద్రానికి లేదా సొంత గ్రామానికైనా మేకపాటి భౌతికకాయాన్ని చివరిచూపు గా తీసుకువస్తే మేకపాటి  ఆత్మశాంతిస్తుందనే అభిప్రాయాన్ని అభిమానులు కొందరు  వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement