Monday, April 29, 2024

కీలక ప్రాజెక్టులపై ఏపీఐఐసీ ఫోకస్.. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

అమరావతి, ఆంధ్రప్రభ: కీలక ప్రాజెక్ట్‌ల పూర్తిపై ఏపీఐఐసీ దృష్టి సారించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి శుక్రవారం ఏపీఐఐసీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. నాల్కో, మిథాని సంయుక్త సంస్థ, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమి-టె-డ్‌ కు చెందిన నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథాని సీఎండీ సంజయ్‌కుమార్‌ ఝా ముఖ్యమంత్రిని ఇటీవలే కలిశారు. ఏడాదికి 60 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 5 వేల 500 కోట్ల రూపాయలతో పెట్టు-బడులు పెట్టనున్న ఆ ప్రాజెక్టుకు కొన్ని మౌలిక సదుపాయాల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యల్ని త్వరగా పరిష్కరించాలంటూ సంబంధిత సీఎం ఆదేశించారు. ఈక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది పర్యటించారు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు-కు కావలసిన మౌలికసదుపాయాల పూర్తికి సత్వరమే కృషి చేస్తామని ఎండీ వెల్లడించారు. ఉత్కర్ష పరిశ్రమ కోరిన విధంగా సీఎం ఆదేశాల మేరకు అదనంగా మరో ఎనిమిది ఎకరాల భూమిని కూడా వారికి అందజేస్తున్నట్లు- పేర్కొన్నారు. మిధాని భూముల్లో ఉన్న సోమశిల ఇరిగేషన్‌ కాలువకు సంబంధించిన సమస్యను కూడా ఆ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ఆదేశించారు. భూములలోఈ ప్రాజెక్టుకు అనుబంధంగా బొడ్డువారిపాలెం ఇప్పటికే ఎంస్‌ఎంఈ పార్కును కూడా ఏర్పాటు- చేశామన్నారు. 110 ఎకరాల భూమిని అప్పగించినట్లు- ఎండి వెల్లడించారు. ఏపీఐఐసీ భూములలో కొన్ని చోట్ల న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపారు. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ హరేంద్రప్రసాద్‌, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌ బాబు, ఓఎస్డీ ల్యాండ్స్‌ సాధన, ఇంజనీరింగ్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, సీజీఎం లచ్చి రామ్‌, జెడ్‌ఎం చంద్రశేఖర్‌, జీఎం గెల్లి ప్రసాద్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.

క్రిస్‌ సిటీ, రిలయన్స్‌ భూముల పరిశీలన
కీలక ప్రాజెక్టులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు- ఎండీ సుబ్రమణ్యం జవ్వాది తెలిపారు. రిలయన్స్‌ , క్రిస్‌ సిటీ- భూముల్ని పరిశీలించారు. భూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జెడ్‌ఎం చంద్రశేఖర్‌ ను ఆదేశించారు. రిలయన్స్‌ భూములు ఉన్నచోట నీటి వసతిపైన ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ సహా ఇప్పటికే భూ కేటాయింపుల ప్రక్రియ, పురోగతిపై ఎండీ సుబ్రహ్మణ్యం సమీక్షించారు. అనంతరం ఇఫ్కో సెజ్‌ ను జిల్లా కలెక్టర్‌ తో కలిసి సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement