Wednesday, May 15, 2024

AP: రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఆప్కాబ్.. సీఎం జగన్

అమరావతి: ఆప్కాబ్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో శుక్రవారం జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ కొత్త లోగో, స్టాంపును సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ….తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాబ్ అభివృద్దిపై కేంద్రీకరించినట్టుగా సీఎం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఆప్కాబ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆప్కాబ్ ఇబ్బందుల్లో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సీఎం చెప్పారు.డిజిటలైజేషన్ తో రైతులకు మరింత వేగంగా సేవలు అందనున్నాయన్నారు.

ఆప్కాబ్ సేవలన్నీ మరింతగా విస్తరించనున్నాయన్నారు. ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఆర్‌బీకేలను ఆప్కాబ్ లతో అనుసంధానించామని సీఎం జగన్ చెప్పారు. ఆర్ బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయన్నారు. దేశ చరిత్రలో మన ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాబ్ టర్నోవర్ రూ.36, 732 కోట్లకు చేరిందని సీఎం జగన్ చెప్పారు. 60 ఏళ్ల ఆప్కాబ్ ప్రయాణంలో ఎంతో అభివృద్ది చెందిందన్నారు. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాయన్నారు. ఒక్క ఏలూరు డీసీసీబీ మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతులకు ఆప్కాబ్ వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నట్టుగా సీఎం వివరించారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువగా తీసుకువచ్చిందన్నారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ పనిచేస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement