Tuesday, April 30, 2024

AP | ఏపీ కోసం సుజనా సైనికుడిలా పని చేశారు.. పీయూష్ గోయల్ ప్రశంసలు

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని, తామిద్దరం 2010లో ఒకేసారి పార్లమెంట్ లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. సుజనకు మద్దతుగా గురువారం ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుడిలా పని చేశారని, ఏపీ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు.

సుజనా తెలివైన, సున్నితమైన నేత అని జాతీయ ప్రయోజనాలే కాకుండా ఏపీ కోసం నిరంతరం శ్రమించిన నేత అని కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనాకు రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతోందని, సుజనా ప్రజలకు మరింత సేవ చేస్తారని అన్నారు. కళ తప్పిన ఏపీకి చంద్రబాబు-పవన్-బీజేపీ నేతలు తిరిగి వెలుగులు తెస్తారని ధీమాగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement