Sunday, April 28, 2024

AP: సొమ్మసిల్లిన టీడీపీ అభ్య‌ర్థి సింధూర రెడ్డి.. ఆస్ప‌త్రికి తరలింపు

శ్రీ సత్యసాయి బ్యూరో, మార్చి 15 (ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తచెరువు మండల కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడప గాని పల్లి నుంచి కొత్తచెరువు వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడం జరిగింది. అంతేగాక టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి పూలహారాలు వేయడం, పూలు చల్లుతూ రావడం జరిగింది.

ముఖ్యంగా ఎండ తీవ్రత, టపాకాయలు కాల్చిన వాసన, పూలదండల వాసన అదేవిధంగా జనం రద్దీ కారణంగా సింధూరరెడ్డికి ఊపిరాడక గాలి సక్రమంగా రాక సొమ్మసిల్లి పడిపోసాగింది. వెంటనే పక్కనే ఉన్న భర్త కృష్ణ కిషోర్ రెడ్డి, ఇతర మహిళల సహాయంతో ఆమెను వాహనం నుంచి కిందికి దింపి కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. కాగా ఎప్పుడూ ఏసీలో ఉంటూ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ కు సంబంధించిన పనులు చూసుకునే సింధూర రెడ్డి ఒక్కసారిగా ఎండవేడిమికి, టపాకాయలు కాల్చిన వాసనకు దిక్కు తెలియక సొమ్మసిల్లి పోవడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement