Sunday, April 28, 2024

AP – అన్నా అని పిలిచిన‌వాడే వివేకా హంత‌కుల‌కు ర‌క్ష‌కుడు… ష‌ర్మిల

పులివెందుల – అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నారంటూ జ‌గ‌న్ పై ఆయ‌న సోద‌రి ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. సాక్ష్యాలు అన్నిబంధువులే హంత‌కులంటున్నా, నిందితులంద‌రూ అన్న నీడ‌లో క్షేమంగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అయిదో వ‌ర్దంతి సంద‌ర్భంగా నేడు పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత. ష‌ర్మిళ నివాళుల‌ర్పించారు..ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన్న మరణంతో చిన్నమ్మ, సునీత అందరి కంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు.
సునీతకు వేధింపులు

న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని షర్మిల మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని విమర్శించారు. బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని తెలిపారు. హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని చెప్పారు. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పని చేశారని అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు. సాక్షిలో పైన వైఎస్ ఫొటో ఉంటుందని… కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు.

తోబుట్టువుల కోసం ఏంచేశాడు..?

అద్దం ముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెపుతోందో వినాలని షర్మిల అన్నారు. తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని జగన్ ను నిలదీశారు. ఐదేళ్లయినా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని చెప్పారు. సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని షర్మిల తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని… వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు.

ఈ సభకు , వివేకా భార్య సౌభాగ్యమ్మ, , టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement