Saturday, May 4, 2024

నా మందు ఆయుర్వేదమే.. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తా: ఆనందయ్య

తన మందు ఆయుర్వేదమేనని ఆనందయ్య కుండబద్దలు కొట్టారు.  ఆయుష్ అధికారుల ఎదుట మందు తయారు చేశానని, వారి మందుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రేపు ఐసీఎంఆర్, కేంద్ర ఆయుష్ బృందం రానుందని తెలిపారు. కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై ప్రభుత్వం, ప్రజలు మద్దతు ఇస్తుందని అన్నారు. తన మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య తెలిపారు.  ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశానని చెప్పారు. వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత మందును పంపిణీ చేస్తామని చెప్పారు.

రిటైర్డ్ హెచ్ మాస్టర్ కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందన్నారు. తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. ఇతర కారణాల వల్ల అనారోగ్యానికి గురై ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. తన మందు వల్లే ఆయన కోలుకున్నట్లు కోటయ్య కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని ఆనందయ్య గుర్తు చేశారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నానని, అమ్మేవారిని కట్టడి చేయాలని కోరారు. త్వరలో అందరికీ మందు ఇస్తానని చెప్పారు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆనందర్య స్పష్టం చేశారు.  

కాగా, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం ప్రజలు కృష్ణపట్నం చేరుకున్నారు. అయితే, ప్రజల తాకిడి ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు.  ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు.  ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత ఉందని ఆయా శాఖలు దృవీకరిస్తే మందు పంపిణీకి అనుమతులు లభిస్తాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement