రేణిగుంట, (ప్రభ న్యూస్): ప్రమాదవశాత్తు రెండు రైలు ఇంజన్లు అదుపుతప్పి భూమిలో కూరుకుపోయిన ఘటన తిరుపతి జిల్లా తిరుచానూరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. తిరుపతి నుండి రేణిగుంట వైపుకు వస్తున్న రెండు లైట్ రైలింజన్లు తిరుచానూరు రైల్వే స్టేషన్ దాటుకున్న తర్వాత లూప్ లైన్లో ఉన్న డివైడర్ను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు రైలింజన్లు డివైడర్ను దాటుకొని భూమిలో కూరుకుపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం రైల్వే అధికారుల విచారణలో తేలనుంది.
రైల్వే అధికారుల సంఘటన స్థలం చేరుకొని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే స్థానికులు తెలిపిన వివరాలు మేరకు తిరుపతి వైపు నుంచి వస్తున్నా రెండు లైట్ రైలింజన్లు తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద నున్న సిగ్నల్స్ వద్ద ఆగాయి. అయితే పక్క రైల్ ట్రాక్ లో వెళ్లే రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రెండు రైలింజన్లకు సిగ్నల్స్ ఇచ్చారు అనుకుని ఇంజన్ డ్రైవర్లు ముందుకు నడిపారు. కొంచెం ముందుకు రైలు ఇంజన్లు వెళ్లేసరికి రైలు ట్రాక్ పై ఉన్న డివైడర్ను ఢీకొని భూమిలో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంతో తిరుపతి – రేణిగుంట మధ్య నడిచే రైళ్లుకు కొంతమేర అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.