Wednesday, May 22, 2024

తల్లి మృతదేహం పక్కనే, నాలుగు రోజులుగా పదేళ్ల బాలుడు.. దుర్వాసన రావడంతో

తల్లి మరణం గురించి తెలియని ఓ పదేళ్ల బాలుడు ఆమె మృతదేహం పక్కనే నాలుగు రోజులుగా ఉంటున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఇవ్వాల వెలుగులోకి వచ్చింది. తిరుపతి సిటీలోని విద్యానగర్​లోని ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కాగా, శనివారం ఇంట్లో దుర్వాసన రావడంతో 10 ఏళ్ల బాలుడు శ్యామ్​ కిషోర్​ తన మామకు సమాచారం అందించాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడి తల్లి అయిన రాజ్యలక్ష్మి  చనిపోయి ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి పరిశీలించారు. దాదాపు నాలుగు రోజుల క్రితమే అంటే మార్చి 8వ తేదీన ఆమె చనిపోయి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ఒంట్లో బాగోలేక అపస్మారక స్థితికి చేరి అట్లాగే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, వ్యక్తిగత విభేదాల కారణంగా రాజ్యలక్ష్మి తన కుమారుడితో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. తల్లి మరణం గురంచి ఆ బాలుడిని ప్రశ్నించగా.. మార్చి 8 న వాంతులు చేసుకుందని, అప్పటి నుండి నిద్రపోతూనే ఉందని అతను చెప్పాడు అని ఇరుగు పొరుగువారు చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో ఉందని, విశ్రాంతి తీసుకుంటున్నాడని బాలుడు భావించాడని, తను లేపడానికి ట్రై చేసినా లేవకపోవడంతో ఆమెను కలవరపెట్టకుండా వదిలేసినట్టు తెలిపారు. కానీ, శరీరం నుండి దుర్వాసన రావడంతో అతను తన మామయ్యకు సమాచారం ఇచ్చాడు అని ఇరుగు పొరుగువారు వివరించారు. అసలు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement