Monday, May 6, 2024

ఆదివాసీల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌ట్టుబడి ఉన్నాం.. సంఘాల ప్ర‌తినిధుల‌తో మంత్రి కేటీఆర్‌

ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రి కే తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో.. ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.. ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా ఆదివాసి రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములపై హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని మా ప్రభుత్వం కలిగి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివాసీల మావ మాటే.. మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు. అడవి ప్రాంతంలో నివాసముండే ఆదివాసీలకు అవసరమైన వైద్య విద్యా సదుపాయాలు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు త్వరలోనే విద్య వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు,

విద్య వైద్య విషయాల్లో సంతృప్త స్థాయి వరకు అందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ తెలియ‌జేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందడం వేగవంతమైందని, అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు, గతంలో ఆదివాసిల కు వైద్య సేవల విషయంలో తీవ్రమైన అలసత్వం ఉండేది.. అలాంటి పరిస్తితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగ్గిందన్నారు, త్వరలోనే మరోసారి ఆదివాసి ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియ‌జేశారు.

ఈరోజు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు… మా పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన విలువైన సలహాలు సూచనలను ప్రభుత్వానికి అందజేసి ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతరావు, ఎమ్మేల్యే అత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఆదివాసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement