Monday, May 20, 2024

CPM Counter – ప్ర‌ధాని మోదీ ఓ నియంత‌!…అందుకే దేశంలో నిరుద్యోగం


బీజేపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది
రెండు ద‌ఫాలుగా జరిగిన ఎన్నిక‌ల్లో స్పష్టత వచ్చింది
అందుకే మ‌తోన్మాదం, రెచ్చగొట్టేలా ప్ర‌సంగాలు
ఆయోధ్య రాముడి పేరిట ప్ర‌చారం మొదలుపెట్టారు
ఎన్నిక‌ల ప్ర‌చారంలో నిరుద్యోగంపై స్పంద‌నే లేదు
మోదీ ప్ర‌ధాని అయ్యేదాకా అదాని ఎవ్వ‌రో తెలియ‌దు
దేశంలో అదానీ, అంబానీ విక‌సిస్తే స‌రిపోతుందా?
ఎలక్ట్రోర‌ల్ బాండ్ల పేరుతో మ‌నీ లాండ‌రింగ్‌
కుంభ‌కోణాల‌ను లీగ‌లైజ్ చేసిన న‌రేంద్ర మోదీ
ఈ ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయాల్లో పెనుమార్పులు
జ‌గ‌న్‌, ష‌ర్మిల వివాదంపై వారే స్పందించాలి
సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి

ఈ ఎన్నికలు దేశంలో చాలా కీలకంగా ఉన్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చామన్నారు. వాటిపై కనీసం ఎక్‌నాలెజ్డ్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నామన్నారు. సీబీఐ, ఈడీ కేవలం రాజకీయ కోణంలోనే పని చేస్తున్నాయని విమర్శించారు.

- Advertisement -

మోదీ నియంతృత్వ విధానాల వల్ల…

స్వాతంత్య్రం త‌ర్వాత‌ ఇంత నిరుద్యోగం ఎప్పుడూ దేశంలో చూడలేదని ఏచూరి అన్నారు. నేడు ప్రతి కుటుంబం అప్పులు చేసి పోషించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతుండగా, ధనికులు మరింత ధనవంతులుగా పెరుగుతున్నారన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక బతుకుదెరువు భారం బాగా పడుతుందన్నారు. ఇదంతా మోదీ నియంతృత్వ విధానాలే కారణమని సీపీఎం అభిప్రాయ పడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలపై మోదీవైపు నుంచి స్పందనే లేదని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జరిగిన సభల్లో కూడా మోదీ ప్రస్తావించలేదన్నారు.

అన్నీ అదానీ, అంబానీ పరమేనా?

వినాశకాలే విపరీత బుద్దులు అనే సామెత మోదీ విషయంలో అర్థం అవుతోంద‌ని ఏచూరి అన్నారు. మోదీ ప్రధాని అయ్యే వరకు అదానీ అనే వ్యక్తి ఎవరో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, పెట్రో కెమికల్ ఇండస్ట్రీ, ఇన్మర్మేష్ టెక్నాలజీ అన్నీ అదానీ, అంబానీ పరమేనా అని నిలదీశారు. టెంపోలో క్యాష్ ఇస్తున్నారంటే బ్లాక్ మనీ ఉందనేది అర్ధం అయిపోతుందన్నారు. అదానీకి, అంబానీ సంస్థలపై ఈడీ, సీబీఐ ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. పోలరైజేషన్‌ను మరింత విస్తృతం చేసి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల తర్వాత…

మొదటి రెండు దఫాలు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మోదీకి ఓటమి తప్పదని తేలిపోయింద‌ని ఏచూరి అన్నారు. అందుకే ఇప్పుడు హిందూత్వం పేరుతో రామ మందిరాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా వారు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో తప్పకుండా పెద్ద మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి పేరుతో పొత్తులతో మోదీ వెళుతున్నారని.. ఇండియా కూటమితో తాము వెళుతున్నామన్నారు. ఈ ఎన్నికలలో ప్రధాన అంశాలు, సమస్యలను మోదీ ప్రస్తావించడం లేదన్నారు. ప్రజల్లో ఉన్న భావాలను రాజకీయంగా మార్చుకుని మతోన్మాదం కోసం మోదీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

మోదీ ఓటమి భయంతో…

తప్పకుండా ఈసారి దేశంలో మార్పు ఖాయం.. ప్రభుత్వం మారడం తధ్యమని ఏచూరి స్పష్టం చేశారు. ఏపీలో తెలుగుదేశం, రీజనల్ పార్టీలకు బీజేపీ పొత్తు వల్ల వారికే నష్టమన్నారు. ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్‌స‌భ‌ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని.. అంటే ఏపీలో బీజేపీకి ప్రాధాన్యం లేదని అందరికీ అర్థమవుతోందన్నారు. మోదీ ఓటమి భయంతో ఇలా ప్రతి రాష్ట్రంలో తగ్గి మరీ.. రీజనల్ పార్టీలకు మద్దతు ఇస్తున్నారన్నారు. మోదీ మతోన్మాద రాజకీయాలు అర్థం కావడం వల్లే ప్రజలు వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు కూడా మోదీ అవినీతికి నిదర్శనమని ఏచూరి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చెప్పిన సంస్థలు తమ లెక్కల్లో అప్పులు, నష్టాలు చూపించారన్నారు. మ‌రి అటువంటి వారు బీజేపీకీ ఎలక్ట్రోరల్ బాండ్లు ఎలా ఇచ్చారో చెప్పలి కదా అని ప్రశ్నించారు.

అదానీ, అంబానీలు వికసిస్తే సరిపోదు..

పార్టీ ఫండ్ పేరుతో మనీ లాండరింగ్‌ను మోదీనే సమర్ధిస్తున్నారని ఏచూరి అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కుంభకోణాలను మోదీ లీగలైజ్ చేశారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ వచ్చిందో.. అక్కడ ప్రజలకు కష్టాలు డబుల్ అయ్యాయని వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో అసలు ఇంజనే వద్దని మోదీని వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. రీజనల్ పార్టీలను విడగొడితేనే.. మోదీ గెలిచే పరిస్థితి లేదని అర్థమైపోయిందన్నారు. వికసిత్ భారత్ అంటే ప్రజల జీవనం వికసించాలన్నారు. కానీ అదానీ, అంబానీలు వికసిస్తే.. దేశం వృద్ధి చెందినట్లు కాదని సెటైర్ వేశారు. ఇండియా కూటమి విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. లౌకిక శక్తులన్నీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు.

జగన్, షర్మిల వివాదంపై వారే స్పందించాలి..

రాజ్యంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు కాపాడేందుకు లౌకకి ప్రభుత్వం ఎంతో అవసరం కూడా అని ఏచూరి చెప్పుకొచ్చారు. దేశంలో అనేక ప్రాంతాలు పరిశీలించాక.. ప్రజల్లో ఈ మార్పు వచ్చిందని గుర్తించినట్లు తెలిపారు. ఏపీలో ఉన్న రాజకీయాల్లో కుటుంబపరమైన వివాదాలు కూడా ఉన్నాన్నారు. జగన్, అతని చెల్లి వివాదంపై వారే స్పందించాలని.. తాము కేవలం అంశాల వారీగానే ప్రస్తావిస్తూ ముందుకు వెళతామని సీతారం ఏచూరి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement