Saturday, April 27, 2024

ప‌ట్టాలెక్కిన రీజ‌న‌ల్ రింగ్‌రోడ్డు.. వచ్చే వారంలో 2వ నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్‌(3ఎ)ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరో వారం రోజుల్లో రెండవ గెజిట్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నది. మొదటి గెజిట్‌లో భూసేకరణ అధికారులు, రింగ్‌రోడ్డు వెళ్లే జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలను తెలియజేశారు. రెండో గెజిట్‌లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను తెలియజేస్తారు. ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తరభాగంలో నిర్మించే ఈ రోడ్డు 158.54 కిలోమీటర్లు ఉంటుంది. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడు ఉత్తర భాగం నిర్మాణమవుతుంది. భూ సేకరణ అధికారులుగా ఏడుగురు ఆర్డీవోలు, ఒక అడిషనల్‌ కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. దీనికి ఆమోదం తెలిపిన కేంద్రం ఈ విషయాన్ని గెజిట్‌లో పొందుపరిచింది. ఏ అధికారి ఏ మండలాల్లో భూ సేకరణ చేయాలో గెజిట్‌లో స్పష్టంచేశారు.

  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, వలిగొండ మండలాల్లో చౌటుప్పల్‌ ఆర్డీవో భూసేకరణ చేస్తారు.
  • భువనగిరి మండలంలో భువనగిరి ఆర్డీవో భూ సేకరణ చేస్తారు.
    -యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ భూసేకరణ చేస్తారు.
  • సిద్దిపేట జిల్లా రాయిపోల్‌, గజ్వేల్‌, వర్గల్‌, మర్కూక్‌ జగదేవ్‌పూర్‌ మండలాల్లో గజ్వేల్‌ ఆర్డీవో భూసేకరణ నిర్వ#హస్తారు.
  • మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలో తూప్రాన్‌ ఆర్డీవో భూ సేకరణ చేస్తారు.
  • కౌడిపల్లి, శివంపేట, నర్సాపూర్‌ మండలాల్లో నర్సాపూర్‌ ఆర్డీవో భూ సేకరణ చేస్తారు.
  • సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్‌, హత్నూర్‌ మండలాల్లో సంగారెడ్డి ఆర్డీవో భూ సేకరణ చేస్తారు.
  • చౌటకూర్‌ మండలంలో అందోల్‌ జోగిపేట ఆర్డీవో భూసేకరణ చేస్తారు.
    ఈ ఉత్తరభాగంలో సేకరించనున్న భూమికి అధికారులు సిద్ధమవుతున్నారు. భూ యజమానులకు త్వరలో భూ సేకరణ నోటీసులు జారీ చేయనున్నారు. రూట్‌ మ్యాప్‌ను రూపొందించిన కె అండ్‌ జె ప్రాజెక్టు సంస్థ ఆయా గ్రామాలను గుర్తించిన మేరకు కేంద్ర రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌కు ఆమోదం తెలిపింది. ఈ భూసేకరణకు నాలుగు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement