Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల హోరు – దూకుడుగా పార్టీల ప్రచారం

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రచార దూకుడు పెరిగింది.  భారీ సంఖ్యలో  అభ్యర్థులు బరలిలో ఉన్నారు. ప్రచారంతోపాటు రాజకీయ విమర్శలపై పార్టీలు  ఫోకస్‌ పెట్టాయి.  అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఉద్యోగ నియామకాల పై ప్రకటన చేసి చర్చకు పెట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో విమర్శల తీవ్రతను పార్టీలు పెంచేశాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్వి పక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల తూటాలు పేల్చుతోంది. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా వెళ్లడంతో  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో  గులాబీ దళం     ప్రచార వ్యూహానికి పదును పెట్టింది.  హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి సురభి వాణీదేవిని నిలబెట్టడంతోనే విషయం అర్థం అయ్యింది. ఇది బీజేపీ సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ కమలానికి చెక్ పెట్టి గులాబీ జెండా ఎగరేయాలన్నది అధికార పార్టీ వ్యూహం. ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుతోపాటు… కేంద్రం తెలంగాణకు ఏం చేయలేదన్న విమర్శతో గులాబి ప్రచారం దూకుడుగా సాగుతోంది.   15 లక్షల నగదు. ఉద్యోగాల భర్తీ ఏమైందని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. పనిలోపనిగా ఉద్యోగాల భర్తీపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిన గులాబీ దళం బిజెపికి సవాల్‌ విసురుతోంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఈ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది టీఆర్‌ఎస్‌ విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇక్కడ విమర్శలకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గులాబి దళం తెరమీదకు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందీ వివరిస్తున్నారు.  విభజన చట్టంలో ప్రస్తావించిన హావిూల అమలుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌నూ వదలడం లేదు టీఆర్‌ఎస్‌. ఒక చోట మాజీ మంత్రి చిన్నారెడ్డి, మరోస్థానంలో మాజీ ఎమ్మెల్సీ రాములనాయక్ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలో ఉండటంతో అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ ఎన్నికల రణతంత్రం రచిస్తోంది. నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌ నియోజక వర్గంలో ఉద్యమకారులు సైతం పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలమంటూ ప్రచారం చేస్తున్నారు. వీరందరికీ ఒకటే సమాధానంగా అభివృద్ధి మంత్రాన్ని వ్లలె వేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈదఫా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో . ప్రిఫరెన్షియల్‌ ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఒకటి, రెండు అంకెలతోనే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి.  ఇవి పూర్తిగా బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే ఎన్నికలు. తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటి లేదా రెండు ఇలా అంకెలు వేస్తారు. వీటినే ప్రాధాన్య ఓట్లు అంటారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రిఫరెన్సియల్‌ ఓట్లను అంచనా వేయలేని పరిస్థితి. పోలైన ఓట్లలో ఎన్ని చెల్లుబాటు అవుతాయో గుర్తిస్తారు. అలా చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికంటే ఒకటి ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కౌంట్‌ చేస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అయినా కొలిక్కి రాకపోతే నాలుగో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కల చిట్టా తేలిన తర్వాతే విజేతను ప్రకటిస్తారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement