Friday, April 26, 2024

Kidnapped: జగిత్యాలలో కిడ్నాప్ కలకలం..

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం పట్టపగలు ఓ యువతి (23)ని కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని దుండగులు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకొన్న సీఐ కోటేశ్వర్‌.. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ల కారు మొరాయించడంతో ధర్మపురి దాటి వెళ్లలేకపోయారు. దీంతో నిందితులు ఉపయోగించిన కారును స్వాధినం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌ కథనం ప్రకారం.. యువతి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఆమె ఒంటరిగా ఇంటివద్ద ఉన్నది. మధ్యాహ్నం సమయంలో సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన మంగళారపు రాజేందర్‌, మరో ముగ్గురు యువతి ఇంటికి కారులో వచ్చారు. అనంతరం యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ధర్మపురి అంబేద్కర్‌ చౌక్‌ వద్దకు రాగానే కారు మొరాయించింది. దీంతో ఇద్దరు దుండగులు కారు దిగి కమలాపూర్‌ రోడ్డు వైపు గల ఓ ఫంక్షన్‌ హాల్‌ వరకు కారును తోసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో డ్రైవర్‌ కూడా కారు దిగి ఇంజిన్‌ను చెక్‌ చేస్తుండగా…యువతి చాకచక్యంగా తప్పించుకున్నది. కేకలు వేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఇండ్లల్లోకి పరుగెత్తింది. దీంతో దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement