Wednesday, May 15, 2024

వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతాం – మంత్రి కేటీఆర్

ప్రభా న్యూస్ వేములవాడ – వేములవాడను వెన్నెల వాడగా తీర్చిదిద్దుతామ‌ని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహించిన మంత్రి కేటీఆర్ 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.. సంద‌ర్బంగా మాట్లాడుతూ, వేముల‌వాడ‌ను అన్ని విధాల అభివృద్ధిప‌దంలోకి తీసుకెళ‌తామ‌ని అన్నారు.. గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను బ‌తుకమ్మ పండుగలోగా పూర్తి చేస్తామ‌న్నారు.. అలాగే ఈ ప‌నుల‌కు నిధులకు కొరత లేదంటూ మూడు షిఫ్ట్ లలో పనులు చేయించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.. అలాగే – వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందేలా ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాల‌ని కోరారు.

కాగా,మంగళవారం నాడు మంత్రి కేటీఆర్‌ వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి లతో కలిసి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మొదట వేములవాడ పట్టణంలోని నంది కమాన్‌ జంక్షన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం చింతలతండా మపంచాయతీలో 42 డబల్ బెడ్‌రూమ్ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్, డీఈఐసీ సెంటర్, మాతృసేవా కేంద్రాలను, హాస్పిటల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిచారు. మూలవాగు బండ్ పార్క్, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. ఆ వెంటనే గుడి చెరువు అభివృద్ధి పనులకు, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కు దిశా నిర్దేశం చేశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందేలా ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలన్నారు. పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్, రైల్వే లైన్ లో భూములను కోల్పోతున్న నిర్వాసితులు మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. వినతిపత్రం స్వీకరించిన కేటీఆర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ మధు సూదన్, ఆలయ కార్యనిర్వణాధికారి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement