Sunday, May 5, 2024

రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట శాపం: విజయశాంతి

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట శాపంగా మరిందని చెప్పడానికి గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలని ఆమె అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుంటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని అన్నారు. ఈ నేపథ్యంలో శివ్వంపేటలోని తహసీల్ కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు.

రెవెన్యూ లోపాలపై ప్రతి పత్రికలో, ప్రతి ఛానల్ లో ఈ సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయని విజయశాంతి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇలాంటి అనుభవాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉన్నాయని విమర్శించారు. కొంతమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా… పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ ఇబ్బందులతో పాటు నకిలీ విత్తనాలు, పంట కొనుగోళ్ల ఇబ్బందులు ఉండనే ఉన్నాయని విజయశాంతి దుయ్యబట్టారు. భూ సమస్యలకు సర్వరోగ నివారణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని మండిపడ్డారు. ఈ వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలతో రైతులతో పాటు ప్రజలందరినీ ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలని విజయశాంతి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement