Monday, April 29, 2024

జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలు: ఎంపీ కేశినేని నాని

ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సీఎం జగన్, సీఎం కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని ఆయన మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా అని చెప్పారు. ఏపీ ప్రజలను జగన్, తెలంగాణ ప్రజలను కేసీఆర్ పిచ్చోళ్లని చేస్తూ ఆడుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

గత ఎన్నికల తర్వాత ఇద్దరు సీఎంలు కౌగిలించుకుని, బొకేలు ఇచ్చుకుంటే… రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని తాను భావించానని నాని అన్నారు. అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరువురూ నాటకాలు ఆడుతున్నారనే విషయం పూర్తిగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇక్కడ జగన్ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాదులో ఆయన చెల్లెలు షర్మిల డ్రామాలు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించలేనంత పిచ్చోళ్లు జనాలు కాదని అన్నారు. 80 శాతం అభివృద్ధి చెందిన అమరావతిని జగన్ వదిలేశారని… ఇప్పుడు కృష్ణా నది కరకట్టను అభివృద్ధి చేస్తానని చెపుతున్నారని… ఆయనను ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: నాగార్జునసాగర్ వద్ద హై టెన్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement