Thursday, April 25, 2024

దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే: ప్రకాష్‌ రాజ్‌కు సుమన్ మద్దతు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడిని పెంచుతున్నాయి. ఎన్నికల్లో మొత్తం ఐదుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలబడుతున్న నటుడు ప్రకాష్‌ రాజ్ ను ‘నాన్ లోకల్’ అంటూ కొందరు వ్యాఖ్యానించండం పెద్ద చర్చకే దారి తీసింది. అయితే, దీనిపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. పరోక్షంగా ప్రకాశ్ రాజ్ కు మద్దతును ప్రకటించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలేనని చెప్పారు. వైద్యులు, రైతులు కూడా నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం కూడా అందదని పేర్కొన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఈ సందర్భంగానే మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు. అందరూ కలసికట్టుగా ఉండాలని… లోకల్, నాన్ లోకల్ అనే భావన వద్దని సూచించారు.

కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడి పదవి కోసం ప్రకాష్‌ రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవిత రాజశేఖర్, నటి హేమ, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీలో ఉన్నారు. 27 మందితో కూడిన తన కార్యవర్గ సభ్యుల జాబితాను నటుడు ప్రకాష్‌ రాజ్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement