హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 17 (ఆదివారం ) జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న నీట్ -2022కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లను మంగళవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డా.సాధనాపరశర్ తెలిపారు. ఈ పరీక్షకు జాతీయస్థాయిలో 18లక్షల 72వేల341 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని497 కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ పరీక్ష ఇతర దేశాల్లోని 14 ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మంగళవారం నుంచి వెబ్సైట్లో హాల్టికెట్లు (అడ్మిట్ కార్డులు) పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీ పొందుపరిస్తే వెబ్సైట్ లో అడ్మిట్ కార్డు లభ్యమవుతుందని పేర్కొంది. ఇన్ఫర్మేషన్ బులిటెన్లో ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోనికి తీసుకుని విద్యార్థులు పరీక్షకు హాజరుకావాలని సూచించింది. అన్ని ప్రాంతీయ భాషల్లో నీట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.