Monday, April 29, 2024

TSPSC Leakage – న్యూజిల్యాండ్ పారిపోయినా ప‌ట్టేశారు.. పేప‌ర్ లీక్ కేసులో మ‌రొక‌రు అరెస్ట్

హైద‌రాబాద్ – టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తాజాగా మరో నిందితుడి అరెస్ట్ నమోదైంది. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన సాన ప్రశాంత్‌ (31) అనే వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 100 మందికి పైకి చేరింది. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం విశేషం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద సిట్ ఆధికారులు కేసులు నమోదు చేశారు.

ఇంతకు ఈ ప్రశాంత్ ఎవరు?
తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డికి స్వయానా బావమరిది ఈ ప్రశాంత్. న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిదికి కూడా క్వశ్చన్ పేపర్ చేరవేశాడు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం చేరవేసిన తర్వాత అతను పరీక్షకు సిద్ధంమై పరీక్ష కూడా రాశాడు. రెండు రోజుల క్రితం నిందితుడు ప్రశాంత్‌ న్యూజిలాండ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. సమాచారం అందుకున్న సిట్‌ పోలీసులు విమానాశ్రయంలోనే అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం రిమాండ్‌ విధించటంతో చంచల్‌గూడ జైలుకు నిందితుడిని తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

కాగా తెలంగాణలో సంచలం సృష్టించిన ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. వీరు ప్రశ్నాపత్రాలను పలువురు అభ్యర్థులకు అమ్మి, వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించిన అధికారులు వారందరినీ అరెస్ట్‌ చేసి కటకటాల వెనుక వేశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు కూడా సిట్‌ పోలీసులు నోటీసులు పంపారు. అయితే అతని నుంచి సరైన సమాధానం రాకపోవటంతో లుక్‌ ఔట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేశారు. దీంతో అతను తాజాగా రాష్ట్రానికి రావడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు రమేష్ ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన సమారు 25 ప్రశ్నపత్రాలను పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి గ్రూప్‌ 1తో సహా పలు ప్రశ్నాపత్రాలను లీక్‌ చేయడంతో చీమల పుట్ట మాదిరి దర్యాప్తు చేసే కొద్ది నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

- Advertisement -

ఈ కేసును అధికారులు విచారణ చేసినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకి వస్తుంది. నిందితులు ఒకరి తర్వాత ఒకరు బయట పడుతున్నారు. చివరకి ఈ కేసులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు 100 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement