Thursday, May 2, 2024

TS : టిప్పర్ బోల్తా…ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

హుజురాబాద్ టౌన్, ప్ర‌భ‌న్యూస్ః మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడగా మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు, మరో యువతి మృతితో బోర్నపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

బోర్నపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి బోనాలకు హాజరయి అర్ధరాత్రి తర్వాత ద్విచక్ర వాహనంపై గంట విజయ్ (17), గంట వర్ష (15) గంట సింధుజ (18) లు ఇంటికి వెళ్తుండగా ఎలబోతారం నుంచి హుజూరాబాద్ వైపు మట్టి లోడుతో టిప్పర్ వస్తుండటాన్ని గమనించి మూలమలుపు వద్ద ఆగారు. అతి వేగంగా వచ్చిన టిప్పర్ వారు ఆగిన చోటే అదుపుతప్పి బోల్తా పడడంతో తో ముగ్గురు ముగ్గురు మట్టిలో కూరుకుపోయారు. గమనించిన గ్రామస్తులు మట్టిని తొలగించి వర్షను బయటకు తీసి 108 వాహనంలో హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన విజయ్, సింధూజలను జేసిబి సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలానికి చేరుకొని తమ పిల్లల మృతదేహాలను చూసి గుండెలు బాదుకుంటూ రోధించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉండగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శ‌నివారం ఉదయం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను పరిశీలించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement