Tuesday, May 21, 2024

Followup: మైనర్‌ బాలికపై అత్యాచారమే కాదు, రాక్షసంగా ప్రవర్తించారు.. మెడికల్‌ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలికపై రేప్‌ ఘటనలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారని మెడికల్‌ రిపోర్టులో వెల్లడైంది. బాలికను నమ్మించి కారులో ఎక్కించుకుని తీసుకెల్లిన‌ నిందితులు కారులో బాలిక మెడపై గోళ్ల‌తో రక్కి గాయాలు చేసినట్లు మెడిక‌ల్ రిపోర్టులో వెల్లడైంది. అంతేకాకుండా బాలిక శరీరంపై పలు చోట్ల కూడా గాయాలున్నాయని రిపోర్టులో డాక్ట‌ర్లు పేర్కొన్నారు. కారులో బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించిన సమయంలో ప్రతిఘటించిందని, దాంతో ఆగ్రహించిన నిందితులు ఇష్టానుసారంగా బాలికపై దాడికి దిగినట్లు ఈ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజాగా అందిన బాలిక వైద్య పరీక్షల రిపోర్టు అందడంతో పోలీసులు దర్యాప్తును కారులో బాలికపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను నిందితుల నుంచి రాబట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కుంటున్న సాదుద్దీన్‌ కొన్ని సమయాలలో బాలికపై జరిగిన అంశాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఇంకొన్ని అంశాలపై మౌనంగా ఉంటున్నాడని తెలిసింది. తాజాగా వచ్చిన మెడికల్‌ రిపోర్టు ఆధారంగా బాలిక ప్రతిఘటించినప్పటికి ఎందుకు కనికరం కలగలేదన్న అంశాలను రాబట్టాలని నిర్ణయించారు. బాలికపై కారులో దాడికి దిగింది ఎవరు, మెడపై గోళ్ళతో రక్కడంతో పాటు శరీరంలోని ఇతర భాగాలలో గాయాలకు కారకులెవరనే అంశంపై వివరాలను సేకరించాలని భావిస్తున్నారు. సాదుద్దీన్‌ రెండవ రోజు విచారణ కొనసాగుతుండగా, శనివారం నుంచి ముగ్గురు మైనర్లను విచారించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement