Sunday, April 28, 2024

TS: తెలంగాణ భాష క్లాసిక్ … అంద‌రికీ నేర్పించాలి – గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

హైద‌రాబాద్ – తెలంగాణ భాష ‘క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. రవీంద్ర భారతిలో నేడు జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ… తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని చెప్పారు.

‘స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ. సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ భాష. మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి. తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తమిళిసై అన్నారు.
‘మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతృభాష తమిళ్. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ’ అని గవర్నర్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement