ఉదయం 8: 45 గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
హాజరుకానున్న 9.80 లక్షల మంది విద్యార్థులు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆంక్షలు
లీకేజీలు, కాపీయింగ్ నేపథ్యంలో అదనపు భద్రత
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా, 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంవారు ఉన్నారని తెలిపారు.
1,521 సెంటర్లు ఏర్పాటు
సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులున్నట్టు వెల్లడించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్ కాలేజీలుండగా, 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు.కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సెల్ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు. ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులు తమ హాల్టికెట్లను tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.