Thursday, April 25, 2024

TS | సిరిసిల్లా నేత కార్మికుల‌ను ఆదుకోండి.. రేవంత్ కు బండి లేఖ

క‌రీంన‌గ‌ర్ : సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు..ఈ మేర‌కు ఆయ‌న ఒక లేఖ రాశారు., విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదని.. వాటిని చెల్లించాలని ఆయన లేఖలో కోరారు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని.. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

“అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం బాధాకరం.” బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించిందన్నారు. ఆ తరువాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిందన్నారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయన్నారు.

దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని.. ఫలితంగా పరిశ్రమతోపాటు అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గత 27 రోజులుగా ఆసాములు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. వారి డిమాండ్లు న్యాయమైనవేనని.. వెంటనే మీరు స్పందించి సమ్మె విరమింపజేయడంతోపాటు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement