Thursday, May 2, 2024

Review Meeting – తులం బంగారం హామీపై రేవంత్ ఆదేశాలు…త్వ‌ర‌లోనే కుల గ‌ణ‌న చేప‌డ‌తామ‌న్న సిఎం

హైద‌రాబాద్ – కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడతామని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని సీఎం తెలిపారు.

మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్ధంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని అన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్‌లో మొదటి ప్రాధాన్యమివ్వాలని రేవంత్ సూచించారు.

ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఫండ్స్‌ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అన్నారు.

మేడారం మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన రేవంత్

- Advertisement -

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడారం మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండ రాం, అమీర్ అలి ఖాన్ లు నేడు రేవంత్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు పూల బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement