Friday, April 26, 2024

డీజీపీని క‌లిసిన రేవంత్ రెడ్డి..

నాగర్ కర్నూలు జిల్లా మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులపై దాడులు జరిగిన నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టు ప్రకటించారని, కానీ ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టు ముందుకు కదలడంలేదని విమర్శించారు. అయితే, ఆ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (నాగం జనార్దన్ రెడ్డి) అక్కడ పర్యటించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అయితే, తమ నేతను టీఆర్ఎస్ నాయకులు దూషించడమే కాకుండా, ఆయనతో కలిసి వచ్చిన ఆ ప్రాంత ప్రజలపై దాడులు చేశారని ఆరోపించారు. ఒకరి గొంతు మీద కాలేసి తొక్కారని, మరొకరిని కొట్టారని, తీవ్ర పదజాలంతో దూషించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాధితుల్లో ఒకరు గిరిజనుడు కాగా, రెండో వ్యక్తి దళితుడు అని వెల్లడించారు. గొంతు మీద కాలేసి తొక్కినందుకు హత్యాయత్నం కేసు, దూషించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement