కాంగ్రెస్ వినూత్న ప్రచారం
పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం
నయవంచన పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
బీజేపీ తీరు.. మోదీ మోసాలను ఎండగట్టే విధానం
అందరినీ ఆలోచింపజేలా ఆకర్షణీయమైన డిజైన్లు
గాంధీ భవన్లో వాల్ పోస్టర్లు రిలీజ్ చేసిన సీఎం, డిప్యూటీ సీఎం
2014 ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు కోట్లు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. మరి మీ పదేళ్ల పాలనలో 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫ్లెక్సీలో ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క యూనివర్సిటీ కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం.. కృష్ణా జల్లాలో ఆంధ్రాకే ఎక్కువ వాటా ఇచ్చిందని పేర్కొన్నారు. పదేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్న అంశాన్ని కూడా హైలైట్ చేశారు.
గతంలో తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గిస్తామని మోదీ హామీ ఇచ్చారని.. కానీ, అందుకు భిన్నంగా వాటి ధరలు ఆకాశాన్నంటాయని రాసుకొచ్చారు. ధరలు పెంచేసి, పేదలపై ఆర్థిక భారం మోపారంటూ ఆరోపించారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, ఆ హామీని తుంగలో తొక్కేశారని ఫ్లెక్సీని డిజైన్ చేశారు.
రైతులను వంచనకు గురిచేసిన మోదీ..
అలాగే.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ మాటిచ్చారని, అవినీతిని కూడా రూపుమాపుతామని చెప్పారని, ఈ పదేళ్లలో అవి జరిగాయా? అని ప్రశ్నిస్తున్నట్టు ఫ్లెక్సీలో చిత్రాలను డిజైన్ చేశారు. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో ₹15 లక్షలు వేస్తామని మోదీ హామీని గుర్తు చేస్తూ.. మా ₹15 లక్షలు ఎక్కడ అని నిలదీశారు. సరిహద్దులో చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుంటే.. చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదంటూ అబద్ధాలు చెప్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామన్న మాటని సైతం గాలికొదిలేశారన్న అర్థం వచ్చేలా ఫ్లెక్సీలో ఫొటోల్ని అమర్చారు. ఇప్పుడీ వాల్ పోస్టర్లు అందరినీ ఆలోచనలో పడేశాయి.. కేంద్రంలోని బీజేపీ తీరును, ప్రధాని మోదీ చేసే మోసాలను ఆలోచింపజేసేలా ఉన్నాయని అంతా చర్చించుకుంటున్నారు.