హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రజారోగ్య విభాగాన్ని బలోపేతం చేసేందుకు మంత్రి హరీష్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం గురువారం జీవో నం.142ను జారీ చేసింది. రోగుల రద్దీకి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తూ డీహెచ్ పరిధిలో మానవ వనరుల హేతుబద్దీకరణ ప్రక్రియకు అనుమతి మంజూరు చేసింది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక్క డీఎంహెచ్వో మాత్రమే ఉండగా, పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసి జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది.
దీంతో జీహెచ్ఎంసి పరిధిలో మొత్తం 6 డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలు కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 డీఎంహెచ్వోలు ఉంటారు. రాష్ట్రంలో 636 పీహెచ్సిలు ఉండగా, ఇందులో వైద్యాధికారి పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్సిలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్సిలను ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేశారు. అయితే, అన్ని సీహెచ్సిలను తెలంగాణ వైద్య విధాన పరిషత్కు బదిలీ చేయడం వల్ల ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పిహెచ్సిల అవసరం ఏర్పడింది. ఈ మండలాల్లో పిహెచ్సిలను మంజూరు చేసింది. రాష్ట్రంలోని 235 అర్బన్ పిహెచ్సిలను బలోపేతం చేయడానికి తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది.
అలాగే, టీవీవీపీ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా వారిని పరిషత్ పరిధిలోకి తీసుకు రావడంతో పాటు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డీఎంఈ కిందకు తీసుకు రావడం జరిగింది. అలాగే, మల్టిdపర్సప్ హెల్త్ అసిస్టెంట్ కేడర్ ఈ హేతుబద్దీకరణలో కవర్ చేయలేదు. కాబట్టి పిహెచ్సిలు, ఇతర సంస్థలలో మంజూరు చేయబడిన ఎంపిహెచ్ఎ పోస్టుల స్థానం మారదు. ఈ హేతుబద్దీకరణ ప్రక్రియలో రోగుల రద్దీకి అనుగుణంగా అవసరాల మేరకు సిబ్బందికి స్థాన చలనం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది.