Thursday, May 2, 2024

Heat Comments – జన గర్జన సభ చూసి బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోవడం ఖాయం: పొంగులేటి

ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2న ఆదివారం ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభను నిర్వహించనున్నారు. దీనిపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో నిర్వహించి ఆహా ఒహో అన్నారని, రాని జనాన్ని కూడా వచ్చినట్లు అంకెల్లో చూపి సంకలు గుద్దుకున్నారని పేర్కొన్నారు. కానీ జూలై 2న ఖమ్మంలో జరిగే తెలంగాణ జనగర్జనకు జనం ఎంతమంది వస్తారో మేము లెక్కేసి చెప్పడం కాదు మీరే లెక్కపెట్టుకోండని, ఖచ్చితంగా ఆ సభను చూసిన తరువాత బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ జన గర్జన సభ కనివినీ ఎరుగని రీతిలో ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా జరిగి తీరుతుందని తెలిపారు.

కాగా, జన గర్జన సభను. జయప్రదం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు టాక్రే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన టాక్రే తొలుత నాయకన్ గూడెంలో పీపుల్స్ మార్చ్ ను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టి ని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాణిక్ రావు టాక్రే కు పొంగులేటి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ జనగర్జన సభా వేదికను పొంగులేటి, జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పొంగులేటి క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రాకను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభకు అంచనాకు మించి జనం వచ్చే అవకాశం ఉ న్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరువుతారని తెలిపారు.


.

Advertisement

తాజా వార్తలు

Advertisement