Tuesday, May 14, 2024

Big Story | జీవో నెం. 317తో మహిళా టీచర్ల అరణ్య రోదన.. స్పౌజ్​ బదిలీల కోసం ఎదురుచూపులు

ఖమ్మం ఎడ్యుకేషన్‌, ప్రభన్యూస్‌: పిల్లలకు ఎడమయి, భర్తకు దూరమై, కుటు-ంబాలను వదిలి, అయినవారూ అందుబాటు-లో లేక, ఒంటరిగా విధులు నిర్వహిస్తున్న వందలాది మంది మహిళా ఉపాధ్యాయినులు దంపతుల బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తూ మౌనంగా రోధిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేసిన జీవో నెం.317తో ఉపాధ్యాయ దంపతులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. 18 నెలలుగా తీర్చలేని వేదనతో నలిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు నిలిచిపోవడంతో వందలాదిమంది మహిళా ఉపాధ్యాయులు సంవత్సరం కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. అలవి కానీ కష్టాన్ని పంటి బిగువున అదిమిపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు ఇంకెప్పుడోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా దయ చూపండి.. కరుణించి తమ కుటుంబాలను కలపండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

తల్లడిల్లుతున్న తల్లులు

ఉపాధ్యాయ దంపతుల బదిలీలు నిలిచిపోవడంతో భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇల్లు, పిల్లలు, వారి విద్యాభ్యాసం నేపథ్యంలో మహిళా ఉపాధ్యాయులు కుటు-ంబాలకు దూరంగా, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంటి పిల్లల భవిష్యత్తు ఏమిటనేది అర్థం కాని పరిస్థితిలో కొందరు ఉంటే, ఎదుగుతున్న ఆడపిల్లలను ఇంట్లో వదిలి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలుచుకొని మహిళా ఉపాధ్యాయులు తల్లడిల్లుతున్నారు. 18 నెలలుగా ఉపాధ్యాయ దంపతుల బదిలీల కోసం మౌనంగా ఎదురుచూస్తున్నారు. ఏ తల్లులకూ ఇలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదని ఆవేదన చెందుతున్నారు.

13 జిల్లాల్లో 18 నెలలుగా నిరీక్షణ

- Advertisement -

ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ప్రభుత్వం 13 జిల్లాల్లో నిలిపివేసింది. ఈ 13 జిల్లాల్లో సుమారు 1600 మంది మహిళా ఉపాధ్యాయులు కుటు-ంబాలకు దూరంగా ఒంటరిగా విధులు నిర్వహిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మంది గడిచిన 18 నెలలుగా ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను, ప్రభుత్వ పెద్దలను కలుస్తూ తమ సమస్యకు పరిష్కారం చూపవల్సిందిగా వేడుకుంటు-న్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ దంపతుల బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమైతే తమ జీవితాలు అగమ్యగోచరంగా మారనున్నాయని భయాందోళనలో ఉపాధ్యాయ దంపతులు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.

ఖాళీలు ఉన్నప్పటికీ కనికరించడం లేదు

ఈ 13 జిల్లాల్లో ఒకటి, రెండు క్యాడర్లు మినహా ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు జరపడానికి కావలసినన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు కానీ, ఇటు- ప్రభుత్వం కానీ చొరవ చూపడం లేదని ఉపాధ్యాయినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 985 పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 46 మంది మాత్రమే దంపతుల కోటాలో బదిలీ కోసం అర్జీ పెట్టు-కున్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని క్యాడర్‌లలో కలిపి 719 పోస్టులు అందుబాటు-లో ఉండగా, కేవలం 10 మంది మాత్రమే స్పాజ్‌ ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా మిగిలిన 11 జిల్లాల్లో కూడా లెక్కకు మిక్కిలి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం జాలి చూపడం లేదని ఉపాధ్యాయ దంపతులు వాపోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట విధి నిర్వహణలో ఉంటే ఉత్పాదకత పెరుగుతుందని పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తదనుగుణంగానే 18 జిల్లాల్లో దంపతులకు బదిలీలు జరిపించారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన 13 జిల్లాల్లో మిగిలిపోయిన ఈ కొద్ది మందిని కనికరించి సాధ్యమైనంత త్వరగా దంపతుల బదిలీల ప్రక్రియ ముగించాలని వేడుకుంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement