Sunday, April 28, 2024

TS : రంజాన్ వేళ‌….రేపు న‌గ‌రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు…

రేపు రంజాన్ పండుగ సంద‌ర్బంగా న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసబ్‌ట్యాంక్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.

- Advertisement -

మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానాపూల్‌, కామాటిపుర, కిషన్‌బాగ్‌, బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్స్‌ నుంచి అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులను బహదూర్‌పురా ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఈద్గా వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలను బహదూర్‌పురా క్రాస్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపుర వైపు మళ్లిస్తారు. ఇక్కడికి వచ్చే వాహనాలు జూ పార్కు వద్ద, మసీద్‌ అల్హా ఓ అక్బర్‌కు ఎదురుగా ఉన్న బహిరంగ స్థలంలో పార్కింగ్‌ చేయాలి.

శివరాంపల్లి, దానమ్మ హాట్స్‌ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్‌ చౌరస్తా నుంచి అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలను దానమ్మ ఎక్స్‌రోడ్స్‌ నుంచి శాస్త్రీపురం, ఎన్‌ఎస్‌ కుంట వైపు మళ్లిస్తున్నారు. ఈ వాహనాలకు మోడ్రన్‌ సామిల్‌ పార్కింగ్‌ పక్కన, ఇద్గా మైదాన్‌కు ఎదురుగా మెయిన్‌ రోడ్డుపై, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌కు పక్కన ఉన్న ఖాళీ స్థలం, దానికి ఎదురుగా ఉన్న సుఫీ కార్స్‌, యాదవ్‌ పార్కింగ్‌(కార్లు) వద్ద పార్కింగ్‌ చేసుకోవాలి.

కాలాపత్తార్‌ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలు.. కాలాపత్తార్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి వెళ్లాలి. సాధారణ వాహనాలు పీఎస్‌ వద్ద నుంచి మోచీ కాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్‌, ఎన్‌కే కుంట వైపు వెళ్లాలి. వాహనాలను బయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపు వద్ద పార్కింగ్‌ చేయాలి.

ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను పురానాపూల్‌ దర్వాజ నుంచి జియాగూడ, సిటీ కాలేజ్‌ వైపు మళ్లిస్తారు.

శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పుర వైపు వెళ్లే భారీ వాహనాలను అరాంఘర్‌ చౌరస్తా వద్ద ఆయా రూట్లలో మళ్లిస్తారు.

హాకీ గ్రౌండ్‌.. మాసబ్‌ట్యాంక్‌
హాకీగ్రౌండ్‌, మాసబ్‌ ట్యాంక్‌ వద్ద జరిగే ప్రార్థనలు మాసబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌ వరకు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్‌ కింద నుంచి వాహనాలను అనుమతించరు. మెహిదీపట్నం, లక్డీకాపూల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫ్లై ఓవర్‌ పైనుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

మెహిదీపట్నం నుంచి రోడ్డు నం.1 బంజారాహిల్స్‌కు వచ్చే వాహనాలను మాసబ్‌ట్యాంక్‌ మీదుగా అనుమతించరు. ఈ వాహనాలు ఫ్లై ఓవర్‌ మీదుగా అయోధ్య జంక్షన్‌, ఖైరతాబాద్‌, తాజ్‌కృష్ణ రూట్‌లో వెళ్లాలి.

లక్డీకాపూల్‌ నుంచి మాసబ్‌ట్యాంక్‌ మీదుగా 1/12 జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్‌ వద్ద ఖైరతాబాద్‌ వైపు మళ్లిస్తారు.

బంజారాహిల్స్‌ రోడ్డు నం.12, పంజాగుట్ట నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వాహనాలను అనుమతించరు. వాహనాలను 1/12 జంక్షన్‌ నుంచి తాజ్‌ కృష్ణ మీదుగా ఖైరతాబాద్‌ వైపు మళ్లిస్తారు. వాహనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సీపీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement