Wednesday, May 1, 2024

Nominated MLC Posts – గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్ లో నిరాశ…

హైదరాబాద్ – గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ నిరాశ కలిగించారు. ఆ ఎమ్మెల్సీల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు చేసినా అంగీకరించేది లేదని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది..

దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై పది రోజుల కిందట విచారణ జరిగింది. హైకోర్టులో శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది.

తెలంగాణ మంత్రి మండలి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేసింది. అయితే వారిని నామినేట్ చేసేందుకు గవర్నర్ అంగీకరించకుండా వాటిని తిరస్కరించారు..వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. నామినేటేడ్ పోస్ట్ లకు నిర్ధారించిన అయిదు రంగాలలోనూ ఈ ఇద్దరు అభ్యర్ధులులేరని గవర్నర్ పేర్కొన్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు. అటువంటివారి పేర్లను పంపితే ఆమోదిస్తానని తమిళి సై తెలిపారు.

అయితే ఆ తర్వాత మరో ఇద్దరి పేర్లను కేసీఆర్ రాజ్ భవన్కు పంపలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రెండు గవర్నర్ స్థానాలు ఖాళీగా ఉన్నందున కోదండరాం,మరో మైనార్టీ పేర్లను సిఫారసు చేయాలని అనుకున్నారు. కానీ కోర్టులో కేసు తేలే వరకూ ఏ సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్ ముందుగానే చెప్పడంతో … ఆ రెండు స్థానాల భర్తీ ఇప్పుడల్లా ఉండదని తేలిపోయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement