Thursday, May 2, 2024

కార్యకర్తలకు అండగా ఉంటాం.. పోచారం శ్రీనివాస్ రెడ్డి

కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా భారతీయ రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం భారతీయ రాష్ట్ర సమితి ప్లినరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధనలో ఎంతోమంది యువత తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని, వారి ప్రాణ త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, ప్రాణత్యాగాలు చేసిన వారిని వారి కుటుంబాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరానివ‌న్నారు. అమరులు చేసిన సేవలను గుర్తుచేసుకొని సభకు హాజరైన వారందరూ మౌనం పాటించారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమల్లో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్లు పోరాటాలు చేశారు.

కేసీఆర్ ఏకైక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని సభాపతి వివరించారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని మహారాష్ట్రలో కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని పోచారం ధీమా వ్య‌క్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని తన శాయాశక్తుల కృషిచేస్తూ అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నానని నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతో అండగా ఉండటం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ప్రజల ఆశీస్సులు లేని వారు ఎవరూ రాణించలేరన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వారి శ్రేయస్సు కోరి శక్తివంచన లేకుండా కృషి చేయడం తన బాధ్యతగా ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గానికి ఇప్పటివరకు తనను అడిగింది ఏది కాదనకుండా నిధుల మంజూరులో సహకరిస్తున్నారని, భవిష్యత్తులో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement