Wednesday, May 8, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు…

నిజామాబాద్‌, (ప్రభన్యూస్‌): ఇందూరు జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోత కోసి ధాన్యం ఆరబోసినా కేంద్రాలు అందు బాటులోకి రాక ఇబ్బందులు పడుతు న్నారు. అధికారుల పర్యవేక్షణ లేమి రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనుగోళ్లలో మాయాజాలం మొదలైంది. తేమ పేరుతో తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్‌ మిల్లర్లు రైతులను వదలడం లేదు. కేంద్రాల్లో తూకం సమయంలో నిబంధనల మేరకే తేమ ఉన్నా రైస్‌మిల్లుకు చేరాక మారిపోతోంది. ఇదే చెబుతూ అదనంగా తరుగు తీస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌ రూ.1960 కాగా కామన్‌ గ్రేడ్‌కు రూ.1940 చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం 17శాతం లోపు తేమ ఉండేలా శుభ్రం చేసి తీసుకురావాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. కాగా తేమ పేరుతో రైతులను కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లర్లు నిలువునా ముంచుతున్నారు. సాధారణంగా రైతులు పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. ఎఫ్‌ఏక్యూ నిబంధనలు పాటిస్తున్నా రైతుల ధాన్యానికి సైతం కడ్తా తీస్తున్నారు. దీనికి తోడు రైస్‌మిల్లర్ల అదనపు దోపిడీ రైతుల పాలిట శాపంగా మా రింది. కేంద్రాల నుంచి రైస్‌మిల్లుకు పంపిన ధాన్యంలో మళ్లీ తేమశాతం లెక్కిస్తున్నారు. 17 శాతం కంటే ఎక్కువ ఉందంటూ కడ్తా ఇస్తే తప్ప బస్తాలు దించుకోమంటూ కొందరు రైస్‌మిల్లర్లు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో జిల్లాలోని నవీపేట, బోధన్‌ మండలాల్లో రైస్‌మిల్లుల ఎదుట రైతులు ధర్నాలు సైతం చేశారు.

తరుగు పేరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగానే కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు ఒకటి రెండు కిలోల తరుగు తీస్తున్నారు. ధాన్యం తూకం పూర్తయి కొంతమంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఒక లారీలో నింపి కేటాయించిన రైస్‌మిల్లుకు పంపిస్తున్నారు. అయితే మిల్లుకు వెళ్లిన ధాన్యం లోడ్‌లో రైస్‌మిల్లర్లు మళ్లీ తేమశాతం పరిశీలిస్తున్నారు. తేమశాతం ఎక్కువ ఉందంటూ తరుగు ఇస్తేనే ధాన్యం దించుకుంటామని చెబుతున్నారు.

దీంతో గత్యంతరం లేక రైతులు ఒక్కో క్వింటాకు నాలుగు కిలోల తరుగు కింద ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒక రైతుకు చెందిన తేమశాతం ఎక్కువ ఉన్నా ఆ లారీలో ఉన్న అందరి రైతుల నుంచి తరుగు తీస్తుండటం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు లేకుండా కొనుగోళ్లు చేస్తామని కలెక్టర్‌ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి క్షేత్రస్థాయిలో పరిశీలించి తరుగు సమస్య లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో దాదాపు 4లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 458 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 419కు పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. బోధన్‌ డివిజన్‌లో కోతలు మొత్తం పూర్తయ్యాయి. శనివారం వరకు జిల్లాలో 1.40లక్షల మెట్రిక టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో మొత్తం 10.66లక్షల మెట్రిక టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. సేకరించే ధాన్యంలో 4లక్షల మెట్రిక టన్నులకు పైగా ధాన్యం బాయిల్డ్‌, మరో నాలుగు లక్షల మెట్రిక టన్నులకు పైగా ధాన్యాన్ని రా రైస్‌ కోసం రైస్‌మిల్లులకు అప్పగించనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement