Monday, May 6, 2024

కస్తూర్బా పాఠశాలలో 32 మంది విద్యార్ధినుల‌కు క‌రోనా….సిబ్బంది నిర్ల‌క్ష్యంపై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం..

కామారెడ్డి: టెక్రియాల్ కస్తూర్బా పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకడం పట్ల జిల్లా కలెక్టర్ శరత్ సీరియస్ అయ్యారు. ఓ వైపు కోవిడ్‌ కేసులు పంజా విసురుతున్న తరుణంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ శరత్ బుధవారం సందర్శించారు. వైద్యులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్‌ఓ లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని బయటకు ఎలా పంపిస్తారని మండిపడ్డారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు విద్యార్థి కరోనా భారిన పడి ఉండవచ్చని, దానివల్ల అందరికి సోకి ఉంటుందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 32 మందికి కరోనా సోకిందని మండిపడ్డారు. పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ స్కూల్‌లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజనం కూడా ఏర్పాటు చేయాలని ఒకవేళ ఇక్కడ వసతి లేకపోతే సౌత్ క్యాంపస్‌కు పంపించాలని పేర్కొన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ, ఎవరు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఇళ్లకు వెళ్తే కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేసుకుని తిరిగి రావాలని సూచించారు. తాము అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇబ్బంది అనుకుంటే ఇంటికి వెళ్లాలని, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాలలో శానిటేషన్ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement