Monday, April 29, 2024

Musi Beautification – కాలుష్య కాసారం నుంచి మూసీ నదిని కాపాడేందుకే 14 వంతెన‌ల నిర్మాణం – కెటిఆర్

హైదరాబాద్​ – మూసీ నది.. హైదరాబాద్​కు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిన నదిగా ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మురికి కూపంగా మారిపోయిందని చెప్పారు. మూసీ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఈరోజు కీలకమైన మొదటి అడుగు పడుతుందని కేటీఆర్ వివరించారు. ఫతుళ్లగూడ-పీర్జాదిగూడ వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ, మూసీ పరిరక్షణ ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. నేడు మొత్తం మూసీ, ఈసీ నదుల‌ల‌పై ఏడు వంతెల‌కు భూమి పూజ చేస్తున్నామ‌ని తెలిపారు.. త్వ‌ర‌లోనే మ‌రో 7 వంతెన‌ల నిర్మాణాల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తామ‌న్నారు..

అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ శిల్పారామం వద్ద చేరుకున్న ఆయన 5 మూసీ వంతెనలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే రూ.152 కోట్ల అంచనావ్యయంతో మూసారాంబాగ్-అంబర్‌పేట మూసీ వంతెనకు శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మూసీ, ఈసీ నదులపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని
కేటీఆర్ తెలిపారు. మూసారాంబాగ్​లో 2020లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని అన్నారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలని ఎస్టీపీలను నిర్మిస్తున్నామని చెప్పారు. దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన కంటే అందమైన వంతెనలను నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పారు. ఇప్పటికే 30,000 డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసుకున్నామని అన్నారు. త్వరలోనే మరో 40 వేల డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​యాదవ్​, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్​ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్, తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ దుర్గంచెరువు వద్ద ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement