Saturday, April 27, 2024

అధైర్య పడవద్దు నేనున్నా: కోవిడ్ బాధితులకు మంత్రి భరోసా

కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు ఏమైనా ఇబ్బందులు  వస్తే తనను సంప్రదించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గంలోని తోర్రురు, పెద్ద వంగర, రాయపర్తి,దేవరుప్పుల, పాలకుర్తి, కోడకండ్ల  మండలంలోని గ్రామాలలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించగానే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన కరోనా కిట్టులోని మందులను వైద్యుల సలహాల మేరకు వాడి కరోనా నుండి విముక్తి పొందాలని కోరారు. కరోనా పాజిటివ్ రాగానే ఆత్మ స్తైర్యాన్ని కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఉండాలని సూచించారు. తీవ్రమైన రోగ లక్షణాలు ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటేనే ఆసుపత్రిలో చేరాలని అయన అన్నారు.

సాధారణ కరోనా లక్షణాలు ఉన్నవారు కరోనా కిట్టులోని మందులు వైద్యుల సలహా ప్రకారం వాడితే కరోనా తగ్గిపోతుందని, ఈ విషయంలో ఎవ్వరు కంగారు పడకూడదని అయన కోరారు. చికిత్స పూర్తి అయ్యేంతవరకు కరోనా పాజిటివ్ వారందరూ హోమ్ హైసోలేషన్ లో ఉండాలని అయన కోరారు. కరోనా కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు వ్యాప్తి చెందకుండా బాధితులు మాస్క్ ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలని, వాళ్ళు నివసించే గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అయన కోరారు.

కరోనా రోగులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలను అందించాలని వైద్యులకు, ప్రజా ప్రతినిధులను, అధికారులను, ఆశా వర్కర్లను మంత్రి కోరారు.   కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా జరుగుతున్నదని మంత్రి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి డోస్ తీసుకోని రెండవ డోస్ తీసుకోని వారికీ వెంటనే వ్యాక్సినేషన్ ఇవ్వాలని వైద్యులను మంత్రి కోరారు. అంతేకాకుండా 60 ఏండ్లు దాటినా ప్రతి ఒక్కరికి ముందు జాగ్రత చర్యగా బూస్టర్ డోస్ ఇవ్వాలని అయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement