Saturday, May 18, 2024

Meeting – సీఎం రేవంత్ తో మాజీ డీఎస్పీ నళిని భేటీ

మాజీ డీఎస్పీ నళిని ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.

తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. తిరిగి విధుల్లో చేరవలసిందిగా రేవంత్ ఆమెకు ఆఫర్ ఇచ్చారు. అందుకు సానుకూలంగా నళినీ స్పందించినట్లు సమాచారం.

స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ 2 లక్షల ఆర్ధికసాయం

నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షల చెక్ ను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు.

ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹2 లక్షలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ₹2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement