Sunday, April 28, 2024

Hyderabad: ఐటి రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారీ చోరీ..

హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. అది కూడా ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ఇంట్లో జరగడం సంచలనంగా మారింది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చోరీ వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు దొంగలు చెప్పడం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూమి కొనుగోలు చేస్తానంటూ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్‌కు సురేందర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తరచుగా రాకపోకలు సాగించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటికి వచ్చిన సురేందర్.. తన వెంట టిఫిన్, కొబ్బరి నీళ్లు తీసుకువచ్చాడు. ఆ కొబ్బరి నీళ్లలో మత్తు మందు కలిపాడు.

కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శ్యామ్యూల్ స్పృహతప్పి పడిపోయాడు. ఇదే ఛాన్స్‌గా భావించిన సురేందర్.. ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. రూ.5 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారం చోరీ చేశాడు. అనంతరం పారిపోయాడు. ఆ తరువాత స్పృహలోకి వచ్చిన శ్యామ్యుల్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. సంచలన విషయాలు బయటపెట్టాడు. తన వెనుక ఒక ఎస్సై హస్తం ఉన్నట్లు నిందితుడు సురేందర్ వెల్లడించాడు. నిందితుడు చెప్పిన సమాచారం సంచలనం రేపడంతో ఆమేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement