Thursday, May 2, 2024

Mahabubnagar Review – కాంగ్రెస్ పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి – కెటిఆర్

హైద‌రాబాద్ – అధికారంలోకి వ‌చ్చిన కొన్ని రోజుల‌లోనే ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు జ‌రిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు.. బీఆర్ఎస్ పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదని పేర్కొన్నారు.

420 హామీలు 420గానే మిగిలిపోయేలా ఉన్నాయి..

‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 ఉన్నాయి. ఈ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి అవుతున్న అని చెప్పి.. రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి పదేపదే చెప్పారు. డిసెంబర్లో కరెంట్ బిల్లు సోనియా గాంధీ కడుతుందని చెప్పారు. రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నారు. రెండు వేల పెన్షన్ను 4,000 చేస్తా అన్నారు. వాటిని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మొన్న ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి వీలుల్లేదని చెప్పారు. జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఈ విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. మహబూబ్ నగర్ పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బీజేపీని నిలదీసే ప్రయత్నం ఉత్తమ్, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు’ అని కేటీఆర్ అన్నారు.

‘ప్రియాంక గాంధీ నాలుగు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు. గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మరలా వచ్చాయి. ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి పంచే పరిస్థితి వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement