Sunday, April 28, 2024

peddapalli: అభివృద్ధిని చూసి ఓటెయ్యండి… ఎమ్మెల్యే దాసరి

9ఏళ్లుగా పెద్దపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభ్యర్థించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ… ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాల నాయకులు మాయ మాటలు, అసత్యపు ప్రచారాలు చేస్తారని వారి ఉచ్చులో పడవద్దన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించాలన్నారు. గత 40 ఏళ్లలో జరగని అభివృద్ధి తోమ్మిదేళ్లలో చేసి చూపామని, జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పించామన్నారు.

ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంకుబండ్ గా ఏర్పాటుచేసి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పామన్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం బోటు సౌకర్యం కూడా కల్పించామన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని, మరోసారి ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని, మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పస్తం హనుమంతు, ఉప్పు రాజకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement