Saturday, April 27, 2024

TS : యూట్యూబ్ ఛానళ్ల‌కు కేటీఆర్ వార్నింగ్… పరువు నష్టం దావా వేస్తాం…

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు.

గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

గతంలో తమపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్‌నెయిల్స్‌తో వార్తల పేరిట ప్రాపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement