Thursday, April 25, 2024

క్షమాపణ చెబుతారా.. వంద కోట్లు కడతారా – రేవంత్, బండి లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

హైదరాబాద్ – టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు గాను.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ లకు పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువునష్టం దావా నోటీసులు పంపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన.. ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో ప్రస్తావించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement