Friday, April 26, 2024

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 28: జీఎస్టీతో సహా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద గత ఆరేళ్లలో (2017 నుంచి 2023 మార్చి 10 వరకు) 1,88,053.83 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వాటా కింద విడుదల చేస్తున్న పన్నుల ఆదాయం గత 5 ఏళ్ళుగా తగ్గుతూ వస్తోందా?  అంటూ రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2017-18లో 29,001.25 కోట్లు, 2018-19లో 32,787.03 కోట్లు, 2019-20లో 28,242.39 కోట్లు, 2020-21లో 24,460.59 కోట్లు, 2021-22 లో 35,385.83 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 38,176.74 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని 29 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వాటా కింద గడిచిన ఆరేళ్ళలో 45,11,442.86 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 2017-18లో 6,73,005.29 కోట్లు, 2018-19లో 7,61,454.15 కోట్లు, 2019-20లో 6,50,677.05 కోట్లు, 2020-21లో 5,94,996.76 కోట్లు, 2021-22 లో 8,82,903.79 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 9,48,405.82 కోట్లు ఆయా రాష్ట్రాల వాటా కింద విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం పన్నుల ద్వారా వసూలు చేసిన నికర ఆదాయంలో రాష్ట్రాల  వాటా కింద నెలవారీ ప్రాతిపదికన పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ నికర ఆదాయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా నిర్ధారించి, ధృవీకరిస్తారని కూడా సమాధానంలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement