Monday, May 6, 2024

Kothakonda – పొన్నంకు బండి క్లాస్ – నన్ను గెలకొద్దు అంటూ వార్నింగ్

తాను కేటీఆర్ ను తిడితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎందుకు కోపం వస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేటీఆర్ నోట వెలువడే మాటలే పొన్నం ప్రభాకర మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరి చెబితే కరీంనగర్ ను వదిలి హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తాను నిర్మాణాత్మకంగా సలహా ఇస్తుంటే వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. తను ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు.

ఈరోజు మధ్యాహ్నం కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజారుల వేద మంత్రోచ్ఛారణలు, ఆశీర్వాదలయాలో ఆలయంలోకి అడుగుపెట్టిన బండి సంజయ్ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… …800 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన కొత్తకొండ కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత ప్రసిద్ది చెందిన ఈ దేవాలయానికి చరిత్ర ఉంది. చుట్టు పక్కల ప్రాంతాల నుండి వచ్చి వీరభద్రుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయ అభివ్రుద్ధి కోసం ఎంపీ నిధుల నుండి రూ. 5లక్షలిస్తున్న. సరిపోక పోతే మరో రూ.5 లక్షలిస్తానని హామీ ఇచ్చారు.

పొన్నం కు స్వీట్ వార్నింగ్

మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ …పొన్నం… నన్ను గెలకొద్దు.. కొత్తగా మంత్రివి అయ్యావు కాబట్టి నాపై చిల్లర మాటలు మాట్లాడినా సంస్కారంగా వ్యవహరించాను. కానీ మితిమీరి పోతున్నడు.. అసలు ఆయనేంది? కేటీఆర్ ను తిడితే పొన్నంకు ఎందుకు కోపం వస్తుంది? కరీంనగర్ ను వదిలి హుస్నాబాద్ కు ఎందుకు పోయిండు? ఎవరు చెబితే పోయిండో తెల్వదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడుతున్నడు. కేటీఆర్ మాటల వల్ల బీఆర్ఎస్ నాశనమైతే… పొన్నం వల్ల కాంగ్రెస్ నాశనమయ్యే పరిస్థితి. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోంది.. జాగ్రత్తగా ఉండాలని నేను సలహా ఇస్తే.. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎట్లా? నేను నిర్మాణాత్మకంగా మాట్లాడితే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా? బండి సంజయ్ కొడుకు కొత్త బట్టలు వేసుకుంటున్నాడు… కొత్త బండి ఎట్ల కొనుక్కున్నడని దిగజారి మాట్లాడుతున్నరు. కటౌట్లు ఎట్లా కడుతున్నడని అంటున్నరు. ఇదేం పద్దతి? బండి సంజయ్ పిల్లలు బట్టలేసుకోవద్దు, బండి కొనద్దా? నేను ఎంపీని కాదా? కటౌట్లు కట్టుకోవద్దా? ఇంత దుర్మార్గమా?….వాళ్ల లెక్క నేను వ్యక్తిగత విమర్శలు చేయను. నేను సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని. ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర నాది. అధికారంలో ఉన్నా పోయినా సమాజం గౌరవించేలా ఉండాలే అహంకారంతో మాట్లాడితే సమాజాం అసహ్యించుకుంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని రాష్ట్రాభివ్రుద్ధి కోసం ప్రజల కోసం పనిచేద్దామని నేను చెబుతుంటే అడ్డగోలుగా మాట్లాడతారా? ఎంపీగా ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ప్రశ్నకు….నేను ఎక్కడ పోటీ చేయాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయం. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. 350 సీట్లకుపైగా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 వందల సీట్లకుపైగా గెలవబోతోంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ప్రభుత్వమే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నా. కేంద్రంలో ఏర్పడేది మోదీ ప్రభుత్వమే కాబట్టి ప్రజలంతా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నా. అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement